ESPN బ్రెజిల్ కథనం ప్రకారం, 2026 అక్టోబర్లో జరిగే ఫిఫా అంతర్జాతీయ విండో సందర్భంగా బ్రెజిల్ జట్టు భారత్లో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్కు వేదికగా కోల్కతాను ఎంపిక చేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. అయితే ప్రత్యర్థి జట్టు ఏది అనే విషయంలో ఇంకా అధికారిక నిర్ణయం వెలువడలేదు.
భారత ఫుట్బాల్ అభిమానులకు పండగే
భారత్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో బ్రెజిల్కు భారీ అభిమాన వర్గం ఉంది. ప్రతి ఫిఫా ప్రపంచకప్ సమయంలో కోల్కతా వీధులు బ్రెజిల్ జెండాలు, జెర్సీలతో కళకళలాడుతుంటాయి. అలాంటి నగరంలోనే బ్రెజిల్ జట్టు ఆడే అవకాశం ఉండటంతో ఫుట్బాల్ అభిమానుల్లో ఇప్పటి నుంచే ఉత్సాహం నెలకొంది.
ఇంకా అధికారిక ప్రకటన లేదు
ప్రస్తుతం ఈ పర్యటనపై చర్చలు జరుగుతున్నట్లు మాత్రమే సమాచారం బయటకు వచ్చింది. బ్రెజిల్ ఫుట్బాల్ సమాఖ్య (CBF) లేదా భారత ఫుట్బాల్ సమాఖ్య (AIFF) నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒప్పంద ప్రక్రియ పూర్తయిన తర్వాత మ్యాచ్ తేదీ, ప్రత్యర్థి జట్టు, టికెట్ల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది.
భారత ఫుట్బాల్కు మంచి అవకాశం
ఈ మ్యాచ్ నిర్వహణ ఖరారైతే భారత ఫుట్బాల్కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది. ప్రపంచ దిగ్గజ జట్టు భారత్కు రావడం వల్ల అభిమానుల్లో ఫుట్బాల్పై ఆసక్తి పెరగడమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ మ్యాచ్లకు కూడా మార్గం సుగమం కావచ్చని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.